ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే తాట తీస్తాం: మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
కరకగూడెం, ఆగస్టు 4 (ఆధాబ్ న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో BNS సెక్షన్ 69, 351(2) కింద కేసు నమోదైన అంశంపై బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేయడం దివాళాకోరు రాజకీయానికి నిదర్శనమని అన్నారు.
15 రోజుల క్రితం ప్రెస్ నోట్ ఇచ్చామని చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు తమ ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, తగిన విధంగా తిప్పికొడతామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ పాలన గురించి ప్రజలకు పూర్తిగా తెలుసని, కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును 35 వేల మెజారిటీతో గెలిపించారని గుర్తు చేశారు. దళిత బంధు అమలులో జరిగిన అక్రమాలపై గతంలో వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా ఇప్పుడు నీతులు చెప్పడం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోందని విమర్శించారు.
మహిళలకు అన్యాయం జరిగితే న్యాయం కోసం ముందుండటం కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని పేర్కొన్న సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యేపై నమోదైన కేసుపై బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నాయకత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తే రాజకీయంగానూ, చట్టపరంగానూ గట్టిగా సమాధానం ఇస్తామని, బెదిరింపులతో కాంగ్రెస్ పార్టీని భయపెట్టలేరని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఎర్ర సురేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నాగబండి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ పోలేబోయిన తిరుపతయ్య, కరకగూడెం సర్పంచ్ పోలేబోయిన సుజాత, తాటిగూడెం ఉపసర్పంచ్ గాంధర్ల రామనాథం, మండల నాయకులు షేక్ రఫీ, జలగం కృష్ణ, గొగ్గలి రవి, బిలపాటి సంపత్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.









