రోడ్డు ప్రమాదంలో జర్నలిస్ట్ మంద సత్యానందం దుర్మరణం
ఎదురెదురుగా ఢీకొన్న రెండు ద్విచక్రవాహనాలు
ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయుడు
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
ఆధాబ్ న్యూస్ ప్రతినిధి
బోనకల్, ఆగస్టు 4:
ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రింట్ మీడియా జర్నలిస్ట్ మంద సత్యానందం (35) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపడంతో పాటు పాత్రికేయ వర్గాలను శోకసంద్రంలో ముంచింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గోవిందాపురం (ఎల్) గ్రామానికి చెందిన మంద సత్యానందం ద్విచక్రవాహనంపై బోనకల్ వైపు వస్తుండగా, రావినూతల సమీపంలోని వే బ్రిడ్జి వద్ద బోనకల్ నుంచి రావినూతల వైపు వెళ్తున్న మరో ద్విచక్రవాహనం ఎదురెదురుగా బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు సత్యానందం తలకు తీవ్ర గాయాలై అధిక రక్తస్రావం కావడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందారు.
మరో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న లక్ష్మీపురం గ్రామానికి చెందిన తోటపర్తి సాయి, కాంపాటి నాగయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్లో వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మృతుడు సత్యానందానికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన అకాల మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, పాత్రికేయ మిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న బోనకల్ ఎస్ఐ మాచినేని రవి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.









