మహిళలు, బాలికల భద్రతకు “పోలీస్ అక్క” కార్యక్రమం కీలకం: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 25 (ఆధాబ్ న్యూస్):
జిల్లాలో మహిళలు, బాలికల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో అమలు చేయనున్న “పోలీస్ అక్క” కార్యక్రమంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ మహిళా పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు తదితర విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మహిళా పోలీసులకు సూచించారు. ముఖ్యంగా బాలల రక్షణ, సైబర్ నేరాల నివారణ, పోక్సో చట్టం, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, ర్యాగింగ్ నిరోధం, బుల్లీయింగ్, ఈవ్ టీజింగ్, స్టాకింగ్ వంటి అంశాలపై విద్యార్థులకు సమగ్రంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
విద్యార్థులు ఎలాంటి వేధింపులు ఎదుర్కొన్నా వెంటనే పోలీసులను సంప్రదించేలా ధైర్యం నింపాలని, మహిళలు, బాలికల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. “పోలీస్ అక్క” కార్యక్రమం ద్వారా విద్యాసంస్థల్లో భద్రతపై అవగాహన పెరగడంతో పాటు పోలీసులపై విద్యార్థులు, మహిళల్లో విశ్వాసం మరింత బలోపేతం అవుతుందని ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు.









