చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి: ఐటిడిఏ పీవో బి. రాహుల్
ఐలాపురం మినీ గురుకుల విద్యార్థులకు రూ.32 వేల విలువైన క్రీడా పరికరాల పంపిణీ
పినపాక, జూలై 24 (ఆధాబ్ న్యూస్): గిరిజన విద్యార్థులు చదువుతోపాటు తమకు ఆసక్తి ఉన్న క్రీడల్లో ప్రతిరోజూ సాధన చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి పాఠశాలకు, గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఐటిడిఏ భద్రాచలం ప్రాజెక్టు అధికారి (పీవో) బి. రాహుల్ సూచించారు.
శుక్రవారం పినపాక మండలం ఐలాపురం మినీ గురుకుల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రూ.32 వేల విలువైన క్రీడా పరికరాలను విద్యార్థులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన తండ్రి వ్యాయామ ఉపాధ్యాయుడు కావడంతో చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి పెరిగిందని, అదే స్ఫూర్తితో గిరిజన విద్యార్థులను క్రీడల్లో ఛాంపియన్లుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
విద్యార్థులను ప్రోత్సహించేందుకు తాను కూడా వారితో కలిసి క్రీడల్లో పాల్గొంటానని, భద్రాచలం ట్రైబల్ మ్యూజియంలో క్రికెట్తో పాటు పలు క్రీడల కోసం మైదానాలు, బాల్ బ్యాడ్మింటన్ కోర్టును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆకస్మిక తనిఖీల సమయంలో కూడా విద్యార్థులతో కలిసి క్రీడల్లో పాల్గొని వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా కృషి చేస్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు వాలీబాల్ నెట్, షటిల్ బ్యాట్లు, బాక్సింగ్ కిట్, టెన్నికాయిట్ రింగ్స్, 50 మీటర్ల టేప్, స్కిప్పింగ్ రోప్స్, కోన్స్, చెస్ బోర్డులు, క్యారం బోర్డులు, లేజిమ్స్, డంబెల్స్, మెడిసిన్ బాల్స్ తదితర క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఆర్సీఓ గురుకులం అరుణకుమారి, స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాలరావు, గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ శకుంతల, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.









