కేటీఆర్ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహిద్దాం: రేగా కాంతారావు
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 23 (ఆధాబ్ న్యూస్): భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన ప్రకటనలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల, గ్రామ కమిటీల నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు బ్రెడ్, పాలు, పండ్లు పంపిణీ చేయడంతో పాటు రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించి అవసరమైన వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ప్రజాసేవనే రాజకీయాల ప్రధాన లక్ష్యంగా భావిస్తూ కేటీఆర్ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారని రేగా కాంతారావు పేర్కొన్నారు. అలాంటి నాయకుడి జన్మదినాన్ని కేవలం కేక్ కటింగ్, శుభాకాంక్షలకు పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం ఆయనకు అందించే నిజమైన గౌరవమని అన్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రతి బీఆర్ఎస్ నాయకుడు, కార్యకర్త స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొని కేటీఆర్ జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని రేగా కాంతారావు పిలుపునిచ్చారు.









