రాష్ట్ర స్థాయి క్రీడా విజేత పూనెం హర్షితకు ఘన సన్మానం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్ జూలై 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆదివాసీ క్రీడాకారిణి పూనెం హర్షిత రాష్ట్ర స్థాయిలో క్రీడారంగంలో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన సందర్భంగా ఆదివాసీ సర్పంచుల సంఘం, గ్రీన్ ఆదివాసీ, తుడుందెబ్బ, ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పలువురు ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ, నేటి ఆదివాసీ యువత విద్య, క్రీడలు, ఉద్యోగాలు, పరిపాలన, సాంకేతిక రంగాలతో పాటు సామాజిక సేవలోనూ ప్రతిభ కనబరిచి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత విజయాలతో పాటు రాజ్యాంగం కల్పించిన ఆదివాసీ హక్కులు, పేసా చట్టం, అటవీ హక్కుల చట్టం, 1/70 నియంత్రణ వంటి చట్టాల పరిరక్షణలో యువత చైతన్యవంతమైన పాత్ర పోషించాలని సూచించారు.
పూనెం హర్షిత సాధించిన విజయం ప్రతి ఆదివాసీ విద్యార్థికి స్ఫూర్తిదాయకమని, గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల విద్య, క్రీడలు, ప్రతిభాభివృద్ధికి ప్రోత్సాహం అందించాలని కోరారు.
ఆదివాసీ యువత తమ సంస్కృతి, సంప్రదాయాలు, భాషను పరిరక్షించుకుంటూనే విద్య, ఉపాధి, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని, సమాజ హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
అనంతరం పూనెం హర్షితకు శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి ఆదివాసీ సమాజానికి మరింత గౌరవం తీసుకురావాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు.









