పెద్ద అంబర్పేటలో నకిలీ డీఏపీ తయారీ ముఠా గుట్టురట్టు
రూ.1.50 కోట్ల విలువైన 1,000 నకిలీ డీఏపీ బస్తాల స్వాధీనం – నిందితులు పరారీ
ఆధాబ్ న్యూస్, హైదరాబాద్, జూలై 19: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ సీఐ చరమంద రాజు నేతృత్వంలో పోలీసులు చేపట్టిన దాడుల్లో పెద్ద అంబర్పేటలో నిర్వహిస్తున్న భారీ నకిలీ డీఏపీ ఎరువుల తయారీ ముఠా గుట్టురట్టైంది. దాడుల్లో సుమారు రూ.1.50 కోట్ల విలువైన 1,000 నకిలీ డీఏపీ ఎరువుల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
సీఐ చరమంద రాజు తెలిపిన వివరాల ప్రకారం, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ప్రాంతానికి చెందిన ఓ రైతు నకిలీ డీఏపీ కొనుగోలు చేసిన ఘటనపై మఠంపల్లి మండలంలో నమోదైన కేసు దర్యాప్తులో కీలక ఆధారాలు లభించాయి. ఆ సమాచారంతో పోలీసులు దర్యాప్తును విస్తరించి పెద్ద అంబర్పేటలోని గోదాముపై మెరుపు దాడి నిర్వహించారు.
తనిఖీల్లో సాల్ట్, గ్రోమోర్, కోరమండల్, అన్నపూర్ణ తదితర ప్రముఖ కంపెనీల పేర్లతో ఉన్న ఖాళీ సంచుల్లో ఉప్పు, మట్టి తదితర నాసిరకం పదార్థాలను రసాయనాలతో కలిపి డీఏపీ ఎరువులుగా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నకిలీ ఎరువుల తయారీకి ఉపయోగించిన ముడి పదార్థాలు, ప్యాకింగ్ సామగ్రితో పాటు 1,000 బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, నాణ్యతపై అనుమానం ఉంటే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.









