వలస ఆదివాసీలకు రాబిన్ హుడ్ ఆర్మీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
70 కుటుంబాలకు సోలార్ లైట్లు, చీరలు, నిత్యావసర సరుకుల పంపిణీ
ఆధాబ్ న్యూస్ – కరకగూడెం, జూలై 18:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని వలస ఆదివాసి గ్రామాలైన నీలాద్రిపేట గండి మరియు అశ్వాపురంపాడు గ్రామాల్లో నివసిస్తున్న 70 వలస ఆదివాసి కుటుంబాలకు రాబిన్ హుడ్ ఆర్మీ స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ దాతల సహకారంతో సేవా కార్యక్రమం నిర్వహించింది.
ఈ సందర్భంగా ప్రతి కుటుంబానికి సోలార్ లైట్లు, చీరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడుల్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, కరకగూడెం ఎస్సై పి.వి. నాగేశ్వరరావు పాల్గొని లబ్ధిదారులకు సామగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై పి.వి. నాగేశ్వరరావు మాట్లాడుతూ, వలస ఆదివాసీలు మద్యం, గంజాయి వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సమాజంలో మంచి గుర్తింపు పొందేలా జీవించాలని సూచించారు. అలాగే తమ పిల్లలను ఉన్నత విద్య చదివించి మంచి భవిష్యత్తు కల్పించాలని కోరారు.
అనంతరం, మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదలకు సేవలందిస్తూ సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతున్న రాబిన్ హుడ్ ఆర్మీ స్వచ్ఛంద సంస్థ సేవలను అధికారులు అభినందించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, రాబిన్ హుడ్ ఆర్మీ సభ్యులు, దాతలు తదితరులు పాల్గొన్నారు.









