పోడు భూములకు పట్టాలివ్వాలి
బందరిగినగరం గిరిజనులపై అటవీ అధికారుల తీరు సరికాదు: సీపీఐ మండల కార్యదర్శి తోగటి కుమార్
ఆధాబ్ న్యూస్, పినపాక, జూలై 15: దశాబ్దాలుగా పోడు భూములను నమ్ముకుని జీవిస్తున్న నిరుపేద గిరిజనులకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని సీపీఐ మండల కార్యదర్శి తోగటి కుమార్ డిమాండ్ చేశారు. బోటిగూడెం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బందరిగినగరం గ్రామ గిరిజనులపై అటవీ శాఖ అధికారులు అవలంబిస్తున్న తీరు సరికాదని ఆయన విమర్శించారు.
ఏడూళ్లబయ్యారం క్రాస్ రోడ్డులోని సీపీఐ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బందరిగినగరం గ్రామానికి చెందిన గిరిజనులు గత రెండున్నర దశాబ్దాలుగా పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. తరతరాలుగా అదే భూమిని నమ్ముకుని జీవిస్తున్న గిరిజనులను సాగు చేయకుండా అడ్డుకోవడం అన్యాయమన్నారు.
గతంలో ఇదే గ్రామంలోని కొందరు గిరిజనులకు పోడు పట్టాలు మంజూరు చేసినప్పటికీ, మరో 45 మంది అర్హులకు ఇప్పటికీ పట్టాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. అర్హులైన గిరిజనులందరికీ సాగు భూములపై యాజమాన్య హక్కులు కల్పించాలని, అటవీ అధికారుల వేధింపులకు అడ్డుకట్ట వేయాలని కోరారు.
ఈ సమస్యపై జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంటనే స్పందించి గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గిరిజనుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఇటీవల కొందరు పాత్రికేయులతో అటవీ అధికారులు దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసిందని, ఆ ఘటనను సీపీఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తోగటి కుమార్ తెలిపారు.
ఈ సమావేశంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు పత్తిపాటి నాగేశ్వరరావు, గడ్డం మనోహరాచారి, మండల సహాయ కార్యదర్శి కప్ప వెంకటేశ్వర్లు, నాయకులు పద్మనాభరాజు తదితరులు పాల్గొన్నారు.









