మణుగూరులో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభించిన డీజీపీ సి.వి. ఆనంద్
ఆధాబ్ న్యూస్ , మణుగూరు, జూలై 6 2026: ప్రజలకు ఆధునిక సౌకర్యాలతో కూడిన మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా మణుగూరులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ను తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ మంగళవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, పోలీసు శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ మానిటరింగ్ సెల్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, సింగరేణి సంస్థ సహకారంతో నిర్మించిన ఈ నూతన పోలీస్ స్టేషన్ ద్వారా ప్రజలకు వేగవంతమైన, సమర్థవంతమైన పోలీసు సేవలు అందించనున్నట్లు తెలిపారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని పేర్కొన్నారు.
నేరాల నియంత్రణ, దర్యాప్తు, సీసీటీవీ నిఘా, సైబర్ నేరాల విచారణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని డీజీపీ తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఈగల్ (EAGLE) వంటి ప్రత్యేక వ్యవస్థల ద్వారా సమన్వయంతో పనిచేస్తున్నామని చెప్పారు.
జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు సత్వర, పారదర్శక పోలీసు సేవలు అందించడంలో ఈ నూతన పోలీస్ స్టేషన్ కీలకంగా మారుతుందని అన్నారు.
అనంతరం డీజీపీ, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో కలిసి పోలీస్ స్టేషన్లోని వివిధ విభాగాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ప్రజలకు స్నేహపూర్వక, జవాబుదారీతనంతో కూడిన సేవలు అందించాలని పోలీసు అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సింగరేణి సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









