అక్రమ సంబంధంపై ఫిర్యాదు… సస్పెండ్కు కారణమన్న కక్షతో యువకుడిని దారుణంగా హత్య చేసిన కానిస్టేబుల్
హన్మకొండ,ఆధాబ్ న్యూస్:
అక్రమ సంబంధంపై పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి తన సస్పెన్షన్కు కారణమయ్యాడన్న కక్షతో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన హన్మకొండలో వెలుగుచూసింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన కానిస్టేబుల్ సహా ఆరుగురిని హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి హత్యలో ఉపయోగించిన కారు, రెండు ఆటోలు, ద్విచక్రవాహనాలు, ఎయిర్ పిస్తోల్ను స్వాధీనం చేసుకున్నారు.
హత్యకు దారితీసిన కథనం:
ములుగు జిల్లా వెంటాపురం పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బాషబోయిన శ్రీనివాస్కు అదే ప్రాంతానికి చెందిన మహిళా నిర్మలతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం అక్రమ సంబంధంగా మారడంతో నిర్మల భర్త, కుటుంబ సభ్యులు సాయి ప్రకాశ్ ద్వారా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయించారు. ఫిర్యాదు అనంతరం కానిస్టేబుల్ శ్రీనివాస్ సస్పెండ్ అయ్యాడు.
కక్షతో ఘోర హత్య:
సస్పెండ్ అయిన తర్వాత తిరిగి విధుల్లో చేరిన శ్రీనివాస్ సాయి ప్రకాశ్పై కక్ష పెంచుకొని, తగిన సమయం కోసం వేచి చూశాడు. ఏప్రిల్ 15వ తేదీన నిర్మల తన భర్త, సాయి ప్రకాశ్తో కలిసి హన్మకొండకు వస్తున్నారని సమాచారం రావడంతో శ్రీనివాస్ తన మిత్రులతో కలిసి రాత్రి 11.30 ప్రాంతంలో గోపాల్పూర్ క్రాస్రోడ్ వద్ద కారు అడ్డగించి సాయి ప్రకాశ్ను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. హసన్పర్తి శివారులోకి వెళ్లి శాలువాతో గొంతు బిగించి హత్య చేశారు.
శవాన్ని పారేయడం… నిందితుల అరెస్ట్:
హత్య అనంతరం మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి హుస్నాబాద్ మండలంలోని జిల్లెడు గడ్డ తండా సమీప బావిలో పడేసి, కారును హన్మకొండ ఏషియన్ మాల్ వద్ద పార్క్ చేశారు. ఈ కేసులో సాంకేతిక ఆధారాలతో హన్మకొండ పోలీసులు నిందితులను ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటూ విచారించి మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు.
అరెస్టైన నిందితుల వివరాలు:
1. బాషబోయిన శ్రీనివాస్ (కానిస్టేబుల్, చింతగట్టు, హన్మకొండ)
2. డేవిలీ సాయి (గుంటూరు జిల్లా)
3. ఆలోత్ అరుణ్కుమార్ అలియాస్ పండు (హన్మకొండ)
4. సబావత్ అఖిల్ నాయక్ (హన్మకొండ)
5. రాజు (హన్మకొండ)
6. చింతం నిర్మల (వెంటాపురం, ములుగు జిల్లా)
పోలీసుల చొరవకు అభినందనలు:
కేసును సత్వరమే ఛేదించి నిందితులను పట్టుకునే పనిలో హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ సతీష్, ఇతర సిబ్బంది కృషిని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, ఏఎస్పీ మనన్ భట్ హాజరయ్యారు.









