ఏసీబీ వలలో మిషన్ భగీరథ డీఈఈ – 10 కిలోమీటర్ల సినిమా రేస్
సూర్యాపేట ,ఆధాబ్ న్యూస్:
సినిమా సన్నివేశాన్ని తలపించేలా… లంచం తీసుకొని పారిపోతూ చివరికి ఏసీబీ వలలో చిక్కిన మిషన్ భగీరథ డీఈఈ!
సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద మిషన్ భగీరథ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ)గా పనిచేస్తున్న ఇస్లావత్ వినోద్, లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. ఈ మధ్యే మక్తల్ నుంచి బదిలీపై సూర్యాపేటకు వచ్చిన ఆయనపై అప్పుడే లంచం ఆరోపణలు ఉన్నాయి.
20 లక్షల డిమాండ్.. వేట మొదలైంది!
మక్తల్లో ఏఈగా పనిచేసే సమయంలో ఒక కాంట్రాక్టర్ను మెజర్మెంట్ బుక్ (ఎంబీ) కోసం రూ.20 లక్షలు డిమాండ్ చేసిన వినోద్, బదిలీ అయినా కూడా ఎంబీని తన వద్దే ఉంచి, డబ్బులు ఇచ్చేవారికే పని చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.
లంచం పాయింట్గా ఫుడ్ కోర్టు!
దిక్కుతోచని కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ ప్లాన్ ప్రకారం కోదాడ బైపాస్ వద్ద ఉన్న ఒక ఫుడ్ కోర్టు వద్ద లావాదేవీ జరగనుండగా, కారులో వచ్చిన వినోద్ కాంట్రాక్టర్ను ఎక్కించుకొని తీసుకెళ్లాడు. అయితే ఏసీబీ అధికారులను గమనించిన అతను, కాంట్రాక్టర్ను కారు నుంచి దింపేసి డబ్బులతో పారిపోయాడు.
10 కిలోమీటర్ల ఛేజింగ్ – లైవ్ అరెస్ట్
దాదాపు 10 కిలోమీటర్లు వెంబడి సినిమా స్టైల్లో వినోద్ను చివరకు పట్టుకున్న ఏసీబీ అధికారులు, ఆయనను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. లంచం వ్యవహారంలో ఈ అరెస్టు జిల్లా వర్గాల్లో కలకలం రేపింది.









