నకిలీ డాక్టర్లపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలి: భయ్యా మల్లికార్జున్
సూర్యాపేట, మే 16, ఆధాబ్ న్యూస్:
నకిలీ డాక్టర్లపై దేశద్రోహ నేరం కింద కేసులు నమోదు చేసి, వారి అక్రమ ఆస్తులను ప్రభుత్వం జప్తు చేయాలని సూర్యాపేట పూర్వ విద్యార్థి మిత్రమండలి ప్రధాన కార్యదర్శి భయ్యా మల్లికార్జున్ డిమాండ్ చేశారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ డాక్టర్లను పట్టుకొని, స్కానింగ్ సెంటర్ల స్కాంలపై తగిన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతుండటాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.
“ఇంతవరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం వెనుక అధికారుల అంతర్యం ఏమిటో?” అని ప్రశ్నించారు. ప్రజలే తిరగబడి పోరాడితేనే అధికారులు స్పందించాల్సి వస్తోందని పేర్కొన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో తన్నీరు యాదగిరి, భగవాన్ కన్నా, జనార్ధన్, సట్టు వెంకన్న, కిషన్ నాయక్, రవీందర్ నాయక్, ధ్రువకాంత్ యాదవ్, విజయ్, కమలాకర్ రావు, చిరంజీవి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.









