తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
తిరుపతి,ఆధాబ్ న్యూస్: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ శనివారం మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. అడవిలో సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఆయన రెండు కిలోమీటర్ల మేర కాలినడకన నడుచుతూ ప్రతి చెట్టును పరిశీలించారు.
ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురు వంటి వృక్షాలతో పాటు శేషాచలం అటవీ పరిధిలో మాత్రమే కనిపించే అరుదైన మొక్కల గురించి అటవీ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్లోని వాచ్టవర్పైకి ఎక్కి అటవీ ప్రాంతాన్ని సమగ్రంగా పరిశీలించారు. వెలిగొండ–శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణముఖి నది ఉద్భవించే ప్రాంతం వంటి అంశాలపై కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇక గుంటిమడుగు వాగు ఒడ్డున కూర్చొని పరిసరాలను ఆసక్తిగా పరిశీలించిన పవన్ కళ్యాణ్, వాగు ఇరువైపులా ఉన్న వృక్షాల రకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్, దానిపై జరుగుతున్న టాస్క్ ఫోర్స్ ఆపరేషన్లు, అటవీ సిబ్బంది కూంబింగ్ వంటి అంశాలపై కూడా వివరాలను సేకరించారు.
అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు తెలిసింది.









