తిరుమల భక్తులకు గుడ్న్యూస్: ఉచిత ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం
తిరుమల,ఆధాబ్ న్యూస్: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తులకు మరింత సౌకర్యంగా యాత్ర సాగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమలలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించేందుకు టీటీడీ ధర్మరథాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డుల రవాణా సంస్థ (APSRTC) బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చింది.
ఈ ఉచిత ఆర్టీసీ బస్సు సర్వీసులను గురువారం తిరుమలలోని అశ్విని హాస్పిటల్ జంక్షన్ వద్ద అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, తిరుమలలో ప్రైవేట్ వాహనాల అధిక ఛార్జీలను నిరోధించడంతో పాటు, ట్రాఫిక్ను నియంత్రించి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ ఉచిత బస్సులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. టీటీడీ ధర్మరథాలు తిరిగే మార్గంలోనే ఆర్టీసీ బస్సులు కూడా నడిచేలా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు.
ప్రతి మూడు-నాలుగు నిమిషాలకు బస్సు:
ప్రతి మూడు నుండి నాలుగు నిమిషాల వ్యవధిలో ఒక్కో బస్సు స్టాప్ వద్దకు చేరుకుంటుందని తెలిపారు. భక్తులకు వేచి ఉండే అవసరం లేకుండా వేగంగా, సురక్షితంగా తిరుమల యాత్రను పూర్తి చేసేలా ఈ సౌకర్యం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పైడి చంద్రశేఖర్, టీటీడీ ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి, డిప్యూటీ ఈవో లోకనాథం, తిరుపతి ప్రజారవాణా అధికారి వెంకటరావు, డిప్యూటీ సీటీఎం విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.









