ఆళ్లపల్లి మండలంలో పెద్దపులి కలకలం
భద్రాద్రి కొత్తగూడెం,
ఆధాబ్ న్యూస్:
జిల్లాలోని ఆళ్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. రేగళ్ల రేంజ్ నుంచి ఆళ్లపల్లి అటవీ పరిధిలోకి ప్రవేశించినట్లు భావిస్తున్న పులి అడుగుజాడలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
ఈ ఘటనతో స్థానిక గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అటవీ అధికారులు వెంటనే అప్రమత్తమై పులి సంచారం ఉన్న ప్రాంతాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
⚠️ గ్రామస్తులకు అటవీ శాఖ హెచ్చరికలు
రైతులు, కూలీలు తాత్కాలికంగా వ్యవసాయ చేనులకు వెళ్లవద్దని సూచించారు.
పశువుల కాపరులు అటవీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
గ్రామస్తులు ఒంటరిగా తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
అటవీ శాఖ అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.








