మణుగూరులో ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం
మణుగూరు, ఫిబ్రవరి 17 (ఆధాబ్ న్యూస్):
పినపాక నియోజకవర్గం మణుగూరు ప్రజాభవన్లో ఆర్డబ్ల్యూఎస్ మరియు మిషన్ భగీరథ అధికారులతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో చేతి పంపులు, ఓహెచ్ఎస్ (OHS) వ్యవస్థలు పూర్తిగా పనిచేసేలా చూసుకోవాలని ఆదేశించారు.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు అందుబాటులో ఉన్నాయా లేదో పరిశీలించి, ప్రతి ఇంటికి త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు.
తాగునీటి సరఫరా విషయంలో నిధుల కొరత ఉన్నట్లయితే, ప్రతి మండలం నుంచి నివేదికలు సమర్పించాలని, అవసరమైన నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ తిరుమలేష్, నియోజకవర్గంలోని ఎంపీడీవోలు, ఎంపీఓలు, మణుగూరు మున్సిపల్ కమిషనర్, ఏఈలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.








