మండలంలో ప్రారంభమైన అమ్మానాన్న పిల్లలు చారిటబుల్ ట్రస్ట్
ట్రస్ట్ ఆధ్వర్యంలో రామాలయానికి రూ.1,00,116 విరాళం – పాఠశాలకు రూ.10,116 సహాయం
విద్యార్థులకు పరీక్ష సామాగ్రి, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కరకగూడెం మండలంలో అమ్మానాన్న పిల్లలు చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలను ట్రస్ట్ చైర్మన్ జాడి మాధవరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా అనంతారం గ్రామపంచాయతీలో నిర్మాణంలో ఉన్న రామాలయానికి రూ.1,00,116/- విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం శ్రీరంగపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు పాఠశాల అవసరాల నిమిత్తం రూ.10,116/- సహాయం అందించారు.
తదనంతరం మండల పరిధిలోని పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలకు అవసరమైన నోట్బుక్స్, పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు. అలాగే తాటిగూడెం గ్రామపంచాయతీలో వృద్ధులు, మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రస్ట్ చైర్మన్ జాడి మాధవరావు మాట్లాడుతూ, తమ తల్లిదండ్రులు కష్టపడి చదివించడంతో ఈ స్థాయికి వచ్చామని, ఇప్పుడు సొంత మండలానికి సేవ చేసే అవకాశం దక్కడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ట్రస్ట్ పనిచేస్తుందని, ముఖ్యంగా విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.
పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను గుర్తించి నగదు బహుమతులు అందజేస్తామని చెప్పారు. ట్రస్ట్ ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు మండలంలో కమిటీ సభ్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ప్రజలు సమాచారం ఇస్తే తక్షణమే సహాయం అందిస్తామని తెలిపారు.
అనంతరం రామాలయ కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించగా, ట్రస్ట్ సభ్యులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఆలయ అభివృద్ధిలో ట్రస్ట్ భాగస్వామ్యం కావడం పట్ల కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షులు డా. జాడి పూజా మాధవ్, కార్యదర్శి జాడి దేవేంద్ర వరప్రసాద్, ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు జాడి రామనాథం, జాడి కోటేశ్వరరావు, మండల కమిటీ నాయకులు రామంటెంకి పూర్ణచంద్రరావు, సతీష్, దినేష్, దుర్గం ప్రేమ్, జాడి విజయ్, యువకులు, ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.









