సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శి పొడియం అడమయ్య మృతి
శ్రద్ధాంజలి ఘటించిన పార్టీ జిల్లా నాయకత్వం.
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం కరకగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని అశ్వాపురం గ్రామానికి చెందిన సీపీఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి కామ్రేడ్ పొడియం అడమయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా నాయకులు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నిమ్మల వెంకన్న, సత్రపల్లి సాంబశివరావు, మండల కన్వీనర్ కొమరం కాంతారావు, ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మడివి రమేష్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, అశ్వాపురం గ్రామం ఏర్పడిన నాటి నుంచే అడమయ్య గ్రామ అభివృద్ధి కోసం సీపీఎం పార్టీ అండతో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని నిరంతరం పోరాటాలు నిర్వహించారని తెలిపారు.
పోడు భూముల సమస్య, వలస ఆదివాసీల సమస్యల పరిష్కారం, మంచినీటి సౌకర్యం, రేషన్ కార్డులు వంటి మౌలిక సమస్యలపై అడమయ్య ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. మండలంలోని అనేక గ్రామాల్లో పోడు భూముల పోరాటాల్లో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు.
గ్రామం ఏర్పడకముందు తరం గ్రామస్తుల్లో ఒకరిగా, ఊరిని నిలబెట్టిన వ్యక్తిగా అడమయ్య చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని, ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని పిలుపునిచ్చారు.
అడమయ్య కుటుంబానికి పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, సీపీఎం పార్టీ ఎల్లవేళలా కుటుంబానికి అండగా ఉంటుందని నాయకులు భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మడివి రమేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు మాదాసు అఖిల్, సీపీఎం మండల కమిటీ సభ్యులు చర్ప సత్యం, బిలపాటి శంకరయ్య, కోవ్వాసి వెంకటేశ్వర్లు, పద్దం బాబురావు, పదం సత్యం తదితరులు పాల్గొన్నారు.









