69వ జాతీయ కబడ్డీ పోటీలకు 33 జట్లు రిజిస్ట్రేషన్ పూర్తి
– జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
పినపాక,ఆధాబ్ న్యూస్:
పినపాక మండలం ఏడుళ్ల బయ్యారం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల మైదానంలో స్కూల్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 69వ జాతీయ కబడ్డీ పోటీలు జనవరి 7వ తేదీ నుంచి ఘనంగా ప్రారంభం కానున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, అలాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల నుంచి ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీలకు విశేష స్పందన లభించిందని ఆయన వెల్లడించారు. ఈ పోటీలు అండర్–17 బాలుర విభాగంలో నిర్వహించబడనున్నాయని, మొత్తం 33 జట్లు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, బిహార్, అస్సాం, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మణిపూర్, త్రిపుర, గుజరాత్, ఢిల్లీ, చండీగఢ్, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటు దాద్రా & నగర్ హవేలీ మరియు డామన్ & డియూ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.
అలాగే కేంద్రీయ విద్యాలయ సంఘటన్, నవోదయ విద్యాలయ సమితి, సీబీఎస్ఈ వెల్ఫేర్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్, సీఐఎస్సీఈ, విద్యాభారతి వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థల జట్లు కూడా తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించనున్నాయని పేర్కొన్నారు. ప్రతి జట్టు నుంచి 6 నుంచి 12 మంది క్రీడాకారులతో రిజిస్ట్రేషన్ పూర్తయ్యిందన్నారు.
ఈ జాతీయ స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందనుందని కలెక్టర్ తెలిపారు. క్రీడాకారులు, కోచ్లు, అధికారులు, అతిథులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వసతి, భోజనం, త్రాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రత, రవాణా వంటి ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నట్లు వివరించారు.
ఈ జాతీయ క్రీడా ఈవెంట్ను విజయవంతంగా నిర్వహించి జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో మరింత పెంచేలా సంబంధిత శాఖలు, నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు.









