నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు
హైద్రాబాద్,ఆధాబ్ న్యూస్:
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు సందేశం కలకలం రేపింది. మధ్యాహ్నం రెండు గంటలకు కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుతుందని గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు పంపినట్లు అధికారులు తెలిపారు.
సమాచారం అందగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా చర్యలలో భాగంగా న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులను వెంటనే కోర్టు నుంచి బయటకు పంపించారు. అనంతరం బాంబు నిర్వీర్య దళాలతో కలిసి కోర్టు భవనం లోపలతో పాటు పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కోర్టు ప్రాంగణంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బెదిరింపు సందేశం పంపిన వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేకంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు.









