తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలు: ఉదయం 11 గంటల వరకు 62.35 శాతం పోలింగ్
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహిస్తున్న తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఉదయం 11.00 గంటల వరకు జిల్లావ్యాప్తంగా మొత్తం 1,75,074 మంది ఓటర్లకు గాను 1,09,155 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, మొత్తం పోలింగ్ శాతం 62.35గా నమోదైందని ఆయన వెల్లడించారు.
ఏడు మండలాల్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. మండలాల వారీగా ఆళ్లపల్లి మండలంలో 60.94 శాతం, గుండాల మండలంలో 71.47 శాతం, జూలూరుపాడు మండలంలో 67.41 శాతం, లక్ష్మీదేవిపల్లి మండలంలో 53.20 శాతం, సుజాతనగర్ మండలంలో 70.30 శాతం, టేకులపల్లి మండలంలో 63 శాతం, ఇల్లందు మండలంలో 60.61 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.
పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే కొనసాగనున్న నేపథ్యంలో, మిగిలిన ఓటర్లు ఆలస్యం చేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.









