ఉదయం 11 గంటల వరకు 57.57% పోలింగ్ నమోదు
– జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహిస్తున్న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఆదివారం ఉదయం 11.00 గంటల వరకు జిల్లాలో మొత్తం 57.57 శాతం పోలింగ్ నమోదైనట్లు ఆయన వెల్లడించారు.
జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చంద్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ మండలాల్లో పోలింగ్ సజావుగా కొనసాగుతోందన్నారు. మొత్తం 1,96,395 మంది ఓటర్లు ఉండగా, అందులో 1,13,064 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.
మండలాల వారీగా పోలింగ్ శాతం ఇలా నమోదైంది:
అన్నపురెడ్డిపల్లి – 64.63%
అశ్వరావుపేట – 68.56%
చంద్రుగొండ – 60.85%
చుంచుపల్లి – 37.49%
దమ్మపేట – 64.85%
ములకలపల్లి – 65.45%
పాల్వంచ – 46.23%
ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనున్న నేపథ్యంలో, ఇంకా ఓటు వేయని ఓటర్లు సమీప పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ స్పష్టం చేశారు.









