ఉప సర్పంచ్ ఎన్నిక కూడా రేపే – రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటన. హైద్రాబాద్,ఆధాబ్ న్యూస్:
రాష్ట్రంలో రేపు జరగబోయే మొదటి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
గురువారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుందని, వెంటనే కౌంటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. పోలింగ్ పూర్తయ్యిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా రేపే నిర్వహించబడుతుందని ఆమె స్పష్టం చేశారు.
మొత్తం 3,834 గ్రామాలు, 27,628 వార్డుల్లో పోలింగ్ జరగనుందని వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తనిఖీల్లో రూ. 8.2 కోట్లు సీజ్ చేసినట్లు రాణి కుముదిని వివరించారు.
రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు తెలిపారు. తొలి విడత ఎన్నికలలో భాగంగా 395 గ్రామాల్లో ఏకగ్రీవం ఎన్నికలు జరిగాయి అని ఆమె పేర్కొన్నారు.
రేపటి పోలింగ్ను శాంతియుతంగా, నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని కమిషనర్ తెలిపారు.









