బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: స్థానిక ప్రజలు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మొగ్గుచూపుతున్నారని మండల అధ్యక్షులు రావుల సోమయ్య తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఓటు అనేది ఎవరి కృప కాదు… ఇది ప్రజాస్వామ్య హక్కు. అధికార పార్టీ సర్పంచ్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అనడం ప్రజలను భయపెట్టే రాజకీయ కుట్ర మాత్రమే. గ్రామం ఎలా ముందుకు వెళ్తుందో నిర్ణయించేది పార్టీ కాదు, ప్రజల ఐక్యత, ప్రజల ఇష్టం” అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ప్రజలను మోసం చేశాయని, రెండు సంవత్సరాల పాలనలో అభివృద్ధి పేరుతో గ్రామాల్లో కనిపించేదేమీ లేదని ఆయన విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ, “శాంక్షన్ అయిన రోడ్లు, బ్రిడ్జిలు కూడా ఈ ప్రభుత్వం పూర్తిచేయలేదు. గ్రామాల్లో అంధకారం, చెత్త సేకరణలో నిర్లక్ష్యం, ప్రజల సౌకర్యాల పట్ల పట్టింపు లేకపోవడం కొనసాగుతోంది” అని వ్యాఖ్యానించారు.
ఎన్నికల ముందు భారీ హామీలు ఇచ్చి, అమలు విషయంలో కాలయాపన చేస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని చెప్పారు. మండల వ్యాప్తంగా ప్రజలు బిఆర్ఎస్ వైపే ఉన్నారని, రాబోయే 11వ తేదీన జరిగే ఎన్నికల్లో మొత్తం 16 గ్రామ పంచాయతీలలో బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు, వార్డ్ మెంబర్లను మీ ఓటుతో గెలిపించాలని సోమయ్య కోరారు.
“కాంగ్రెస్కు ఓటుతో తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఇది” అని మండల అధ్యక్షులు తెలిపారు.









