అక్రమ నగదు–మద్యం రవాణాను అరికట్టాలని సూచనలు
భద్రాచలం SST చెక్పోస్టును తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం ,ఆధాబ్ న్యూస్:
ఎన్నికల నేపథ్యంలో అక్రమ నగదు మరియు మద్యం రవాణాను సమర్థవంతంగా అరికట్టాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అధికారులకు సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు భద్రాచలం బ్రిడ్జ్ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన SST (స్టాటిక్ సర్వేలెన్స్ టీం) చెక్పోస్టును ఎస్పీ ఈరోజు పరిశీలించారు.
చెక్పోస్టు వద్ద జరుగుతున్న వాహన తనిఖీలను పరిశీలించిన ఎస్పీ, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి సంబంధిత వివరాలు నమోదు చేయాలని అక్కడి అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా పనిచేస్తూ, ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా జరిగే నగదు, మద్యం వంటి అక్రమ రవాణాలను ఖచ్చితంగా అరికట్టాలని సూచించారు.
పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం ప్రక్రియ సజావుగా జరిగేలా బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్సై సతీష్ తదితరులు పాల్గొన్నారు.









