పినపాక నియోజకవర్గం, కరకగూడెం మండలం — చిరుమళ్ళ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి ఉమామహేశ్వరి హామీల జల్లు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని చిరుమళ్ళ పంచాయతీ ప్రజలకు అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతూ, తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థి చందా ఉమామహేశ్వరి హామీల వరద కురిపించారు. పేదల పక్షాన నిలబడి సేవ చేయడం తమ కుటుంబ ధర్మమని, గతంలో చందా నరసింహారావు చేసిన సేవలకు కొనసాగింపుగా ప్రజలకు మరింత సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు.
అభ్యర్థి ప్రకటించిన ప్రధాన హామీలు ఇవీ:
1. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు — శుద్ధమైన త్రాగునీటిని ఇంటింటికి అందించే ప్రణాళిక.
2. పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం — పంచాయతీలో ఏ ఇంట్లో పెళ్లి జరిగినా చందా నరసింహారావు ట్రస్ట్ ద్వారా ₹5000 అందజేయడం.
3. మరణించిన కుటుంబాలకు ₹3000 సహాయం — బాధలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తామని స్పష్టం.
4. చెరువుల అభివృద్ధి — చెరువుల్లో మోటార్లు ఏర్పాటు చేసి నీటిని కాపాడటం, రైతులకు సాగునీటిపై ఎద్దడి లేకుండా చూడటం.
5. వరద ముంపు గ్రామాల రక్షణ — వర్షాకాలంలో వరదలకు గురయ్యే గ్రామాలను గుర్తించి నీళ్లు బయటికి వెళ్లేలా డ్రైనేజీలు నిర్మించడం.
6. నిరంతర వీధిలైట్లు — పంచాయతీలో చీకట్లు లేకుండా ప్రతి వీధిలో వెలుగులు.
7. మరణించిన వ్యక్తులకు ఫ్రీజర్ సౌకర్యం — దూరపు బంధువులు చేరే వరకు అమృతదేహాన్ని భద్రపరిచే రిఫ్రిజిరేటర్ ఏర్పాటు.
8. పేద విద్యార్థులకు పై చదువులకు ఆర్థిక సాయం — విద్యతో భవిష్యత్తు మెరుగుపరచుకునే అవకాశాలను కల్పించడం.
9. క్రీడా ప్రతిభావంతులకు ప్రోత్సాహం — యువతను క్రీడల వైపు ప్రోత్సహించే ప్రత్యేక పథకాలు.
10. గ్రామాల్లో చేపల పెంపకం కోసం కుంటల తవ్వకం — గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే నిర్ణయం.
ఈ సందర్భంగా ఉమామహేశ్వరి మాట్లాడుతూ,
“మా కుటుంబం పేదల పక్షాన నిలబడి సేవ చేయడం ఆనాటి నరసింహారావు సంప్రదాయం. అదే సంకల్పంతో మీ ముందుకు వచ్చాను. మీరు నాకు అవకాశం ఇస్తే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కట్టుబడి ఉంటాను. త్వరలోనే మీ ఇంటికి, గడపగడపకు వచ్చి మీ ఆశీర్వాదం కోరుతాను,” అని తెలిపారు.









