ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి — ఎస్పీ రోహిత్ రాజు. భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్;
పంచాయతీ ఎన్నికలు ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు లేకుండా పూర్తిగా శాంతియుత వాతావరణంలో సాగేలా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టిందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సమయంలో చట్టవ్యవస్థను కఠినంగా అమలు చేయడమే లక్ష్యంగా జిల్లాలో అన్ని విభాగాలతో సమన్వయం ఏర్పాటుచేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలో 22 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు (FST), 06 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు (SST), 06 అంతర్రాష్ట్ర చెక్పోస్టులు, 04 అంతర్జిల్లా చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు 24 గంటలు అప్రమత్తంగా పనిచేస్తూ, ఎన్నికలకు భంగం కలిగించే ఏ అంశాన్నీ ఉపేక్షించబోవని తెలిపారు.
ఎఫ్ఎస్టి, ఎస్ఎస్టి బృందాలకు కీలక సూచనలు చేస్తూ ఎస్పీ రోహిత్ రాజు ఇలా అన్నారు:
డ్యూటీ పాస్పోర్ట్ అందుకున్న వెంటనే సంబంధిత ఇన్చార్జ్ను సంప్రదించి వారి మొబైల్ నంబర్ తీసుకొని సమన్వయం పాటించాలి.
తప్పనిసరిగా మండల ప్రధాన కార్యాలయంలోనే ఉండాలి; రిలీవర్ వచ్చే వరకు డ్యూటీ స్థలం విడిచి వెళ్ళకూడదు.
తనిఖీల్లో ఆపిన ప్రతి వాహనం వివరాలు — సమయం, వాహనం నంబర్, ప్రయాణ ఉద్దేశం, తీసుకున్న చర్య — రిజిస్టర్లో ఖచ్చితంగా నమోదు చేయాలి.
నగదు, బంగారం, మద్యం, బహుమతులు లేదా అనుమానాస్పద వస్తువులు దొరికితే వాటికి కాపలా ఉండి ఇన్చార్జ్ సూచనల మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్కు ఎస్కార్ట్ చేయాలి.
తనిఖీ, స్వాధీనం సమయంలో మొబైల్ వీడియో రికార్డింగ్ తప్పనిసరిగా ఉండాలి. ఇది పారదర్శకతను పెంచడంతో పాటు అనవసర ఆరోపణలను నివారిస్తుంది.
రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రభావితం చేయకుండా పర్యవేక్షించాలని, ఇలాంటి సంఘటనలు గమనించిన వెంటనే ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
చెక్పోస్టుల వద్ద వాహన తనిఖీల సమయంలో అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎస్పీ రోహిత్ రాజు చివరిగా, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అన్ని విభాగాలతో సమన్వయం పాటిస్తూ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, నిబంధనలకు లోబడి జరగేలా భాద్యతగా విధులు నిర్వర్తించాలని కోరారు.
జిల్లా ప్రజల్లో నమ్మకం కలిగించేలా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగడానికి దోహదం చేయనున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.









