రేగళ్ల పంచాయతీలో 5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రేగళ్ల గ్రామపంచాయతీలో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను శనివారం పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది ఏళ్లుగా ప్రజలకు రాకపోయిన రేషన్కార్డులు ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన వారికి వేగంగా జారీ అవుతున్నాయని తెలిపారు. ప్రతి అర్హుడికి 6 కిలోల సన్నబియ్యం అందజేస్తున్నామని చెప్పారు. అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తూ, సొంతింటి కలను నిజం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు.
అదే విధంగా గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల విద్యుత్ ఉచితం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కి గ్యాస్ సిలిండర్, వడ్డీలేని రుణాలు, రెండు లక్షల వరకు రుణమాఫీ, రైతు బీమా, రైతుబంధు, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం వంటి పథకాలను ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్నట్లు వివరించారు.
అనంతరం గ్రామస్తులు తమ సమస్యలను దరఖాస్తుల రూపంలో ఎమ్మెల్యేకు అందజేయగా, వాటిని సంబంధిత శాఖాధికారులు తక్షణం పరిశీలించి పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో MRO కాంతారావు, MPO, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇగ్బాల్ హుస్సేన్ మండల రాజకీయ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









