ములుగు ఎస్పీగా సుధీర్ రాంనాథ్ కేక నియామకం
మహబూబాబాద్కు బదిలీ అయిన డాక్టర్ శబరీశ్
ములుగు,ఆధాబ్ న్యూస్:
ములుగు జిల్లా పోలీసు వ్యవస్థలో మార్పులు చోటుచేసుకున్నాయి. ములుగు ఎస్పీగా పనిచేస్తున్న డాక్టర్ శబరీశ్ను రాష్ట్ర ప్రభుత్వం మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో గతంలో ములుగు అడిషనల్ ఎస్పీగా సేవలందించిన సుధీర్ రాంనాథ్ కేకను కొత్త జిల్లా ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
త్వరలోనే సుధీర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో ములుగులో అడిషనల్ ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉండటంతో, జిల్లా భద్రత, లా అండ్ ఆర్డర్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే అవకాశంగా పోలీసులు భావిస్తున్నారు. స్థానిక సమస్యలపై అవగాహన కలిగిన అధికారి రావడంతో జిల్లా ప్రజలు, పోలీసు సిబ్బంది సానుకూలంగా స్పందిస్తున్నారు.
డాక్టర్ శబరీశ్ ములుగు జిల్లాలో నేర నిరోధక చర్యల్లో, ప్రత్యేకంగా అడవి ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లలో ప్రత్యేక శ్రద్ధ చూపిన అధికారి అని పోలీసు వర్గాలు చెప్పాయి. ఆయనను మహబూబాబాద్కు బదిలీ చేయడంతో అక్కడి పోలీసులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.









