కరకగూడెంలో లంబాడీ ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం
ఆదివాసుల పోడు భూములపై కక్ష్య సాధింపు చర్యలు – జేఏసీ తీవ్ర ఆగ్రహం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలో లంబాడీ ఫారెస్ట్ బీట్ అధికారుల అత్యుత్సాహం, ఆదివాసులపై దౌర్జన్యం తీవ్రమైంది. పోడు భూముల విషయంలో కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆదివాసీ జేఏసీ మండల కమిటీ తీవ్రంగా మండిపడింది.
ఆదివాసీ జేఏసీ అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా లంబాడీ వర్సెస్ ఆదివాసీ కేసులు కొనసాగుతున్న తరుణంలో, కరకగూడెం మండలంలోని ఫారెస్ట్ సిబ్బంది ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆక్షేపణలు చేశారు.
అక్రమ కేసులు – జేఏసీ ఆరోపణలు
ఇటీవలి కాలంలో అశ్వాపురంపాడులో ముగ్గురు ఆదివాసులపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపిన ఘటనకు ఒక నెల కూడా గడవక ముందే, అల్లేరుగూడెం గ్రామంలో మరో ఆదివాసీ కుటుంబం అధికారుల దాష్టికానికి గురికావడం ఆశ్చర్యకరమని జేఏసీ నేతలు పేర్కొన్నారు.
5వ షెడ్యూల్ భూముల్లో గిరిజనేతరులే సాగు…
5వ షెడ్యూల్ పరిధిలో ఉన్న భూభాగాల్లో వందల ఎకరాలను లంబాడీలు, ఇతర గిరిజనేతరులు ఎటువంటి రికార్డులు లేకుండా ఏళ్ల తరబడి సాగు చేస్తున్నా… అధికారులు నిమ్మకు నీరేతినట్లు చూస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో అన్ని చట్టబద్ధ హక్కులు కలిగిన ఆదివాసులను “మీరు వలస వచ్చారు, ఆధారం లేదు, వెళ్లిపోండి” అంటూ బెదిరించడం దౌర్జన్యం అని జేఏసీ మండిపడింది.
అధికారుల నిర్లక్ష్యం – జేఏసీ ప్రశ్న
ఆదివాసుల హక్కులు, చట్టాలు కాపాడాల్సిన అధికారులు లంబాడీల పక్షాన నిలబడడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు. ఇలా కొనసాగితే పరిస్థితులు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించారు.
తక్షణ చర్యలు తీసుకోవాలంటున్న ఆదివాసీ జేఏసీ
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, అటవీ డివిజనల్ అధికారులు వెంటనే స్పందించి, లంబాడీ ఫారెస్ట్ బీట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక (జేఏసీ) డిమాండ్ చేసింది.
కరకగూడెం మండలంలో ఈ విషయం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.









