త్వరలో భద్రాద్రి కొత్తగూడెంకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభానికి తేదీ ఖరారు దిశగా… మంత్రి తుమ్మల ఆహ్వానం
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారికంగా ఆహ్వానించారు. మంగళవారం సీఎం తో జరిగిన భేటీలో కొత్తగూడెం పర్యటనపై తుమ్మల వివరాలు తెలియజేయగా, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
డిసెంబర్ మొదటి వారంలో సీఎం పర్యటన
డిసెంబర్ 1 నుండి 8 మధ్య తమకు అనుకూలమైన తేదీని నిర్ణయించి తెలియజేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో డిసెంబర్ మొదటి వారంలో కొత్తగూడెం పర్యటన ఖరారైనట్లే అయింది.
పకడ్బందీ ఏర్పాట్లకు ఆదేశాలు
సీఎం రానున్న విషయం ఖరారైన వెంటనే మంత్రి తుమ్మల, విద్యాశాఖ సెక్రటరీ శ్రీధర్, జిల్లా అధికారులు, సంబంధిత శాఖలకు కీలక సూచనలు జారీ చేశారు.
కార్యక్రమ వేదిక, స్టేజ్, లేఅవుట్ పనులు తక్షణమే ప్రారంభించాలని
రోడ్లు, పార్కింగ్, వసతులు, రాకపోకల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని
భద్రత విషయంలో పోలీసు శాఖతో సమన్వయంగా పని చేయాలని
అతిథుల వసతి, మీడియా సెంటర్ ఏర్పాట్లకు ప్రత్యేక దృష్టి పెట్టాలని
విశ్వవిద్యాలయ భవనాలు, ల్యాబ్లు, మౌలిక వసతుల పరిశీలన పూర్తిచేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు.
సీఎం పర్యటనకు జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశాలు వెళ్లిన వెంటనే నిర్వాహణ పనులు వేగం పడ్డాయి.
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందనున్న వర్సిటీ
సుమారు 300 ఎకరాల్లో నిర్మించిన మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ దేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా రూపుదిద్దుకుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఆధునిక ల్యాబ్లు, పరిశోధన కేంద్రాలు, అంతర్జాతీయ ప్రమాణాల సౌకర్యాలతో ఈ వర్సిటీ ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నారు.
తుమ్మల కృషితో సాధ్యమైన ప్రాజెక్ట్
మైనింగ్ కళాశాలను విశ్వవిద్యాలయంగా అప్గ్రేడ్ చేయడం, దానికి మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ పేరు నిర్ణయించడం మంత్రి తుమ్మల నిరంతర కృషితోనే సాధ్యమైందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆయన ప్రయత్నాలకు ప్రజలు, విద్యారంగ నిపుణులు అభినందనలు తెలుపుతున్నారు.
యువతకు అవకాశాలు – జిల్లాకు అభివృద్ధి
వర్సిటీ ప్రారంభం ద్వారా వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు, యువతకు పరిశోధన–ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తుమ్మల తెలిపారు. పరిశ్రమలు–విద్యా సంస్థల సమన్వయంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.
సీఎం పర్యటనకు అధికార యంత్రాంగం ఇప్పటికే సన్నద్ధమవుతోంది.









