జాతరకు వెళ్లేందుకు డబ్బులు ఇవ్వలేదని బాలుడు ఆత్మహత్య
మహబూబ్ నగర్, ఆధాబ్ న్యూస్:
మహబూబ్నగర్ జిల్లా, హన్వాడ మండలం సల్లోనిపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక 7వ తరగతి విద్యార్థి విజయ్ (13) ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళితే— కార్తీక పౌర్ణమి సందర్భంగా కురుమూర్తి జాతరకు స్నేహితులతో కలిసి వెళ్లాలని విజయ్ ఇంట్లో చెప్పాడు. ఇందుకోసం తండ్రి శ్రీనివాసులు వద్ద రూ.100 అడిగాడు. అయితే పనులు ఉన్నాయని తండ్రి డబ్బులు ఇవ్వలేకపోయాడు. దీనితో మనస్థాపానికి గురైన విజయ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
తరువాత తల్లి ప్రభావతి పరిస్థితి తెలుసుకుని డబ్బులు ఇప్పించినా, అప్పటికే స్నేహితులు జాతరకు వెళ్లిపోయారు. బాధతో విజయ్ ఇంటి వద్ద ఉన్న పొలానికి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఈ విషాదం తీవ్ర కలకలం రేపింది









