భద్రాచలం సాయిబాబా ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా
భద్రాచలం,ఆధాబ్ న్యూస్:
భద్రాచలం సాయి బాబా ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు మంగళవారం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణం భజనలతో, సాయిబాబా స్తోత్రాలతో మార్మోగింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై కార్తీక దీపాలను వెలిగిస్తూ భక్తి పరవశంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదెం వీరయ్య దంపతులు హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చక బృందం మేళతాళాలతో వారిని ఘనంగా ఆహ్వానించారు.
అనంతరం పొదెం వీరయ్య ఆలయంలోని మహా శివలింగానికి పాలాభిషేకం చేసి, మహా దీపాన్ని వెలిగించారు.
వేడుకల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు సాయిబాబా ఆలయ చైర్మన్ కొమనపల్లి ఆదినారాయణ, కమిటీ సభ్యులు తమ్మళ్ల వెంకటేశ్వర్లు, హస్మతుల్లా, వాసిరెడ్డి సాంబశివరావు, కొల్లపూడి వరుణ్, బసవరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.









