చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణకు శాఖల సమన్వయం అవసరం: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిత్తడి నేలల సంరక్షణకు శాఖల సమన్వయం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా వెట్ల్యాండ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ సమక్షంలో సమావేశం జరిగింది.
జిల్లా వ్యాప్తంగా చిత్తడి నేలలను గుర్తించడం, వాటి భౌగోళిక సరిహద్దులను నిర్ణయించడం, పరిరక్షణ, అభివృద్ధి వంటి అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం చిత్తడి నేలల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలి. అటవీ శాఖ, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, సర్వే విభాగాలు సమన్వయంతో పనిచేయాలి.జిల్లాలో ప్రాథమికంగా 50 చెరువులను ఎంపిక చేసి, వాటిపై సమగ్ర సర్వే చేయాలని, భౌగోళిక సరిహద్దులను ఖచ్చితంగా నిర్ణయించి క్షేత్రధృవీకరణ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గుర్తించిన ప్రాంతాల్లో నిర్మాణాలు, మానవ జోక్యం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.చిత్తడి నేలలు పర్యావరణ సమతుల్యతకు కీలకం. ఇవి వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలను పెంచడంలో, వన్యప్రాణులకు ఆశ్రయం కల్పించడంలో, పర్యాటకాభివృద్ధికి దోహదపడతాయి. వాటిని కాపాడటం మనందరి బాధ్యత.
వెట్ల్యాండ్ ప్రాంతాలలో పర్యాటక అవకాశాలున్నట్లు గుర్తించిన కలెక్టర్, పర్యాటక శాఖతో సమన్వయం చేసి పర్యావరణ అనుకూల ప్రాజెక్టుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాప్రియ, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ సుజాత, జిల్లా పంచాయతీ అధికారి అనూష, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.









