అంగనవాడి సేవలను విస్తృతపరచాలి – జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సౌరబ్ శర్మ
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్ : మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అంగనవాడి సేవలను క్షేత్రస్థాయిలో మరింత విస్తృతపరచాలని జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సౌరబ్ శర్మ సూచించారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ అధికారి జే. స్వర్ణలత లెనినా అధ్యక్షతన సిడిపీవోలు, సూపర్వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బందితో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన అసిస్టెంట్ కలెక్టర్ సౌరబ్ శర్మ, ప్రతి అంగనవాడి కేంద్రంలో పిల్లల ఎత్తు, బరువును క్రమం తప్పకుండా కొలిచి, వారి పెరుగుదలపై సమగ్ర నివేదికలు సమర్పించాలని సూచించారు. తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలను వైద్యశాఖతో సమన్వయం చేసి, న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ కేంద్రాలకు సిఫారసు చేయాలని చెప్పారు.
జిల్లాలోని 295 అంగనవాడి కేంద్రాల్లో పెరటి తోటల పెంపకం చేపడుతున్నట్లు తెలిపారు. వాటి ద్వారా లభించే పౌష్టిక ఆహారాన్ని లబ్ధిదారులకు అందజేసి పౌష్టిక విలువలను పెంపొందించాలి అన్నారు.
అదేవిధంగా అంగనవాడి కేంద్రాలకు మంజూరైన పక్కా భవనాలు, త్రాగునీరు, టాయిలెట్లు వంటి సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రతి రోజు లబ్ధిదారుల హాజరు శాతాన్ని నమోదు చేయడంతో పాటు, ఉదయం 9 గంటలకు కేంద్రాలను తెరచి షెడ్యూల్ ప్రకారం పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి జే. స్వర్ణలత లెనినా, కార్యాలయ సూపరింటెండెంట్ ముత్తయ్య, సీనియర్ అసిస్టెంట్ పాషా, సిడిపీవోలు, సూపర్వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు.









