అటవీ శాఖ అధికారులపై ఉద్రిక్తత – అశ్వాపురంపాడు గ్రామంలో ఘటన
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కరకగూడెం మండలం అశ్వాపురంపాడు గ్రామంలో శుక్రవారం అటవీశాఖ అధికారుల తనిఖీల సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం — అశ్వాపురంపాడు అటవీ ప్రాంతంలో కొంతమంది వలస ఆదివాసీలు పోడు భూమిలో వరి పంట సాగు చేశారు. వరి కోత కోసం హార్వెస్టర్ యంత్రాన్ని అడవిలోకి తీసుకెళ్తుండగా అధికారులు ఆపినట్లు సమాచారం. అడవిలో భారీ వాహనాల అనుమతి లేనందున అడ్డుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తలెత్తిన ఘర్షణలో సెక్షన్ ఆఫీసర్ గోవిందు, బీట్ ఆఫీసర్ కోటేశ్ స్వల్పంగా గాయపడ్డారని తెలుస్తోంది.
ఘటనపై కరకగూడెం పోలీస్ స్టేషన్లో అధికారుల తరఫున ఫిర్యాదు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.









