విపిఎల్-5 కప్ విజేతగా సివిల్ (మణుగూరు) జట్టు
కొత్తూరు కింగ్స్పై ఒక్క పరుగు తేడాతో గెలుపు
తాడ్వాయి,ఆధాబ్ న్యూస్: దసరా పండుగ సందర్భంగా తాడ్వాయి మండలంలోని రంగాపురం స్కూల్ మైదానంలో నిర్వహించిన విపిఎల్-5 ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ఉత్కంఠభరితంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో సివిల్ (మణుగూరు) జట్టు కొత్తూరు కింగ్స్పై ఒక్క పరుగు తేడాతో గెలిచి విజేతగా నిలిచింది.
ఈ సందర్భంగా ప్రధాన అతిథులుగా హాజరైన చెన్నూరు శేషు బాబు, కొపెల్ల కిరణ్ ప్రసాద్, కొమరం వెంకటనారాయణ విజేత జట్టుకు రూ.20,116 నగదు బహుమతి మరియు రన్నరప్ జట్టైన కొత్తూరు కింగ్స్కు రూ.10,116 నగదు బహుమతి అందజేశారు.
ముఖ్య అతిథులు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో అణిముత్యాల్లాంటి క్రీడాకారులు ఉన్నారని, పట్టణాల్లో జరిగే ఐపీఎల్ తరహా ఆక్షన్ టోర్నమెంట్లను గ్రామీణ స్థాయిలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తేవడంలో సహాయపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇర్ప సూర్యం, జివ్వాజి మోహన్ రావు, గుమ్మడి ముత్తయ్య, సీనియర్ ప్లేయర్ భానుప్రసాద్, టోర్నీ నిర్వాహకులు రంజిత్, ప్రసాద్, గోపి, సుధాకర్, శివ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు అతిథులను ఘనంగా సత్కరించారు.









