చిరు సినీ ప్రస్థానానికి 47 ఏళ్లు పూర్తి
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్: మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానానికి ఈరోజుతో 47 ఏళ్లు పూర్తి అయ్యాయి. 1978లో విడుదలైన ప్రాణం ఖరీదు సినిమాతో వెండితెరకు పరిచయమైన చిరంజీవి, ఒక్కో అడుగు వేస్తూ, ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇండస్ట్రీలో అగ్రస్థానాన్ని సంపాదించారు. 155 సినిమాలతో తెలుగు సినీ చరిత్రలో చిరస్మరణీయమైన మైలురాళ్లు సృష్టించారు.
నటన, స్టైల్, డాన్స్, ఎంటర్టైన్మెంట్లో కొత్త దారులు చూపిన చిరంజీవి, మాస్ హీరో ఎలా ఉండాలో వెండితెరపై ప్రతిపాదించారు. నేల, బెంచి, బాల్కనీ మధ్య తేడా లేకుండా అభిమానులను తన వైపు తిప్పుకున్న స్టార్గా నిలిచారు. రాబోయే మూడు ఏళ్లలో మరికొన్ని సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
తన 47 ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిరంజీవి ట్వీట్ చేశారు. “ప్రేక్షకుల ఆశీస్సుల వల్లే ఈ ప్రయాణం సాధ్యమైంది. నాకు వచ్చిన అవార్డులు, రివార్డులు, పేరు, ప్రఖ్యాతులన్నీ అభిమానుల ప్రేమ ఆశీర్వాదాల బలమే. ఇక ముందు కూడా ఇదే విధంగా అభిమాన మద్దతు ఉండాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
మెగాస్టార్ 50 ఏళ్ల సినీ ప్రస్థానోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ఇండస్ట్రీ అంతా, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.









