సూర్యాపేటలో బీహార్ కార్మికుల ఆందోళన – పోలీసులపై దాడి
సూర్యాపేట, ఆధాబ్ న్యూస్:
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కంపెనీ వద్ద ఆందోళన చేస్తున్న బీహార్ కార్మికులు పోలీసులపై దాడికి దిగడంతో పరిస్థితి వేడెక్కింది.
వివరాల్లోకి వెళ్తే – నిన్న ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు గాయపడి, మిర్యాలగూడలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో సహచర కార్మికులు కంపెనీ ఎదుట న్యాయం చేయాలని ఆందోళన ప్రారంభించారు.
కార్మికులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా ఘర్షణ తలెత్తింది. ఆగ్రహంతో ఉన్న బీహార్ కార్మికులు కర్రలు, రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడగా, రెండు పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత కొనసాగుతుండగా, అదనపు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.









