హైదరాబాద్లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టు
హైద్రాబాద్,ఆధాబ్ న్యూస్:
హైదరాబాద్ నగరంలోని చర్లపల్లి ప్రాంతంలో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీని మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భేదించారు. ప్రత్యేక ఆపరేషన్లో రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 32 వేల లీటర్ల రా మెటీరియల్ను కూడా గుర్తించారు.
ఈ కేసులో ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేసినట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో బంగ్లాదేశ్ మహిళ కూడా ఉన్నట్టు సమాచారం. ఆమె వాంగ్మూలంతోనే ఈ గుట్టురట్టు బయటపడింది.
పోలీసుల ప్రాథమిక విచారణలో, ఈ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున ఎండీ (MD) డ్రగ్స్ తయారవుతున్నట్లు బయటపడింది. తయారీదారులు, సరఫరాదారుల మధ్య బలమైన నెట్వర్క్ పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఇక్కడ తయారైన మత్తు పదార్థాలు దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి.
డ్రగ్స్ తయారీని కప్పిపుచ్చడానికి, నిందితులు ఈ యూనిట్ను కెమికల్ ఫ్యాక్టరీ పేరుతో నడుపుతున్నారు. ప్రస్తుతం కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు, మాఫియా నెట్వర్క్లో మరికొంతమంది కీలక వ్యక్తులు ఉన్నారని అనుమానిస్తున్నారు.









