జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం – కలెక్టర్ హెచ్చరిక
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వచ్చే 2-3 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ హెచ్చరించారు. వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆయన ప్రజలను కోరారు. జిల్లాలో ఏదైనా ప్రాంతంలో మూడు గంటలకు పైగా వర్షం కురిసినా లేదా 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనా సంబంధిత అధికారులు తక్షణమే పరిస్థితులను పరిశీలించి, వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు.
అవసరమైతే సమీప పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించి, ఆహారం, తాగునీరు, అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని ఆయన స్పష్టం చేశారు.
జిల్లా ప్రజలు ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనూ జిల్లా కంట్రోల్ రూమ్ ను సంప్రదించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
📞 జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్లు: 08744-241950, 08744-241951









