ఆధాబ్ న్యూస్:
జార్ఖండ్లో షాకింగ్ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. OTP, డెబిట్ కార్డు అవసరం లేకుండానే మోసగాళ్లు వృద్ధ మహిళ బ్యాంకు ఖాతా నుంచి రూ.10,000 విత్డ్రా చేశారు.
గర్హ్వా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రధాని కిసాన్ యోజన ప్రయోజనాలు పొందేందుకు సహాయం చేస్తామంటూ మోసగాళ్లు బాధిత మహిళను సంప్రదించారు. ఆ తరువాత ఆధార్ ఆధారంగా ఆమె కళ్లకు ఐరిస్ స్కాన్ చేసి, ఖాతా వివరాలను యాక్సెస్ చేశారు. మరుసటి రోజు బ్యాంకుకి వెళ్లినప్పుడు తన ఖాతా నుంచి నిధులు మాయం కావడంతో మోసపోయిన విషయం ఆ మహిళకు తెలిసింది.
మోసం ఎలా జరిగింది?
నేటి పరిస్థితుల్లో చాలా బ్యాంకు ఖాతాలు ఆధార్ కార్డుతో అనుసంధానించబడి ఉన్నాయి. వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్ ద్వారా డబ్బును విత్డ్రా చేసుకునే అవకాశం ఉండటంతో మోసగాళ్లు ఈ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. బాధితురాలి ఆధార్ నంబర్ సేకరించి, బయోమెట్రిక్ స్కాన్ ద్వారా ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించారు.
ఎలా జాగ్రత్తపడాలి?
మీ ఆధార్ కార్డును ఎవరితోనూ పంచుకోవద్దు.
అవసరమైతే UIDAI వెబ్సైట్లో లభించే వర్చువల్ ఆధార్ నంబర్ను మాత్రమే ఉపయోగించండి.
UIDAI సౌకర్యం ద్వారా మీ బయోమెట్రిక్ సమాచారాన్ని లాక్ చేయండి.
బయోమెట్రిక్ సేవలు ఉపయోగించే సమయంలో మాత్రమే అన్లాక్ చేసి, తరువాత మళ్లీ లాక్ చేయడం అలవాటు చేసుకోండి.
సైబర్ నిపుణులు చెబుతున్నట్లుగా, అప్రమత్తతే ఇలాంటి మోసాల నుండి రక్షణ కల్పిస్తుంది.









