మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్ఠించండి – ఎఫ్ఆర్వో తేజస్వీ
పినపాక,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్వో తేజస్వీ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే పిఒపి విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పిఒపి) విగ్రహాలు నీటి వనరులను తీవ్రమైన కాలుష్యానికి గురి చేయడంతో పాటు, వాటి రసాయనాలు జలజీవుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయని నిపుణులు హెచ్చరించినట్టు చెప్పారు. మట్టి గణపతిని ప్రతిష్ఠించడం వల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా, పండుగ అనంతరం గృహాలలో గానీ, తోటల్లో గానీ సులభంగా నిమజ్జనం చేయవచ్చని వివరించారు. ఇలా చేయడం ద్వారా ప్రకృతి సమతుల్యం నిలబెట్టవచ్చని తెలిపారు.
కార్యక్రమంలో డీఆర్వోలు వెంకటేశ్వర్లు, అరుణ, ఎఫ్ఎస్వో వెంకటమ్మ, బీట్ ఆఫీసర్లు రాణి, శశిరేఖ, ఆదిత్యతో పాటు అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.









