షరతులు లేకుండా రైతులకు యూరియా అందించాలి – బీఆర్ఎస్ నాయకుల డిమాండ్
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు.
మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రావుల సోమయ్య మాట్లాడుతూ –
“రైతులు పండించే పంటలకు షరతులు లేకుండా యూరియా అందించాలి. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, 20 నెలలు గడిచినా రైతులను పట్టించుకోవడం లేదు. సకాలంలో ఎరువులు కూడా సరఫరా చేయలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
తరువాత రైతుల సమస్యల పరిష్కారం కోసం, సమయానికి ఎరువులు అందించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి వ్యవసాయ అధికారికి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రేగా కాళిక, సొసైటీ డైరెక్టర్ రావుల కనకయ్య, భూర్గంపాడు మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు, యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్, మాజీ సర్పంచులు ఊకే రామానాథం, పాయం నర్సింహారావు, కొమరం విశ్వనాథం, పోలెబోయిన నరసింహారావు, బీఆర్ఎస్ నాయకులు చిరంజీవి, నాగేష్, సత్యనారాయణ, పోలేబోయిన క్రిష్ణరావు, సోషల్ మీడియా అధ్యక్షులు సిద్ది సునిల్, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.









