గోదావరి నీటిమట్టం పెరుగుదలపై ఎస్పీ హెచ్చరిక
భద్రాచలం,ఆధాబ్ న్యూస్:
భద్రాచలం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో నీటిమట్టం పెరుగుతూ ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ హెచ్చరించారు.
అతను మాట్లాడుతూ, “ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఇతర విభాగాలతో సమన్వయంగా ముందస్తు చర్యలు చేపడుతోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు” అని సూచించారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని ఆయన తెలిపారు. చెరువులు, వాగులు, వంకల వద్ద వీడియోలు, సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలకు గురికావద్దని ప్రజలను హెచ్చరించారు.
వాహనదారులు ప్రయాణాల సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించిన ఎస్పీ, “ఎవరైనా విపత్కర పరిస్థితుల్లో ఉంటే వెంటనే డయల్ 100కు కాల్ చేసి పోలీసు సేవలను వినియోగించుకోండి” అని ప్రజలను కోరారు.









