ప్రతి క్షణం
ప్రజల పక్షం

  భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ – అధికారులు అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ – అధికారులు అప్రమత్తంగా ఉండాలి

హైదరాబాద్‌,ఆధాబ్ న్యూస్: రాబోయే 72 గంటలపాటు భారీ వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని విభాగాల అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయడం, ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

విద్యుత్, నీటి సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థలు, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర టోల్‌ఫ్రీ నంబర్లు, మరియు క్లౌడ్ బరస్ట్ వంటి తీవ్ర పరిస్థితులను ఎదుర్కొనే ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవసరమైతే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడమే కాకుండా, ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యం కల్పించాలన్నారు.

భద్రాచలం జిల్లా సమీక్ష
సీఎం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, సబ్ కలెక్టర్ మ్రాణల్ శ్రేష్ట, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, ఇతర విభాగాల అధికారులు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. వరదలు వచ్చే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని, నదులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్లకూడదని స్పష్టం చేశారు.

తాగునీటి కలుషితం నివారించేందుకు, పారిశుద్ధ్యం కాపాడేందుకు, వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. రైతులకు సూచనలు అందించేందుకు వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉండాలని, ప్రసవం సమీపించిన గర్భిణీలను ముందుగా ఆసుపత్రులకు తరలించాలని సూచించారు.

సమీక్ష సమావేశంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, సిపిఓ సంజీవరావు, పంచాయతీ అధికారి చంద్రమౌళి, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, వైద్యాధికారి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!