ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఘనంగా
జెండా ఎగరేసిన రేగా కాంతారావు – ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఉత్సాహభరితంగా జరిగింది. పినపాక మాజీ ఎమ్మెల్యే, జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఎగరేసి, కొమరం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మండలంలోని 16 గ్రామ పంచాయతీల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఆదివాసులు సీతారాంపురం తెలంగాణ గ్రామీణ బ్యాంకు వద్ద ప్రారంభమైన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు, డీజే పాటలు, కొమ్ము డాన్సులు, సంప్రదాయ నృత్యాలతో మూడు కిలోమీటర్ల దూరం ఊరేగింపుగా కరకగూడెం ప్రధాన కేంద్రం నుంచి వీరాపురం క్రాస్ వరకు ప్రదర్శన సాగింది.
మహానీయుల స్ఫూర్తి
“ఆదివాసి అస్తిత్వాన్ని కాపాడిన మహానీయుడు కొమరం భీం ఆశయాలను ప్రతి ఆదివాసి బిడ్డ ముందుకు తీసుకెళ్లాలి” అని రేగా కాంతారావు పిలుపునిచ్చారు.
సాంస్కృతిక విందు
కార్యక్రమంలో కొత్తూరు గ్రామ చిన్నారుల వేషధారణ నృత్యాలు, తుమ్మలగూడెం యువత ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. అనంతరం ఆదివాసి జేఏసీ ఏర్పాటు చేసిన రుచికరమైన భోజనం విందుగా అందించారు.
ఈ వేడుకల్లో ఆదివాసి జేఏసీ నాయకులు, మండల ప్రజా ప్రతినిధులు, మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు, పటేళ్లు, యువజన నాయకులు, పెద్ద సంఖ్యలో ఆదివాసి ప్రజలు పాల్గొన్నారు.









