కామ్రేడ్ అయోధ్య మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి వ్యాఖ్య
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కామ్రేడ్ బొల్లోజు అయోధ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, “కామ్రేడ్ అయోధ్య మరణం సిపిఐ పార్టీకే కాక, ఈ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమానికి, ప్రజలకు తీరని లోటు” అని అన్నారు.
గురువారం రామానుజవరం గ్రామంలో అయోధ్య స్వగృహానికి చేరుకున్న మధుసూదన్ రెడ్డి, ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, “కామ్రేడ్ అయోధ్య ప్రజల మధ్యే జీవించి, వారి సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడాడు. ప్రజలకు ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది ఆయనే. రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా, కమ్యూనిస్టు ఉద్యమాన్ని తుడిచిపెట్టేంతటి సంక్షోభాల్లోనూ నిబద్ధతతో ముందుండి పోరాడాడు” అన్నారు.
“తన కుటుంబం కోసం కాక, ప్రజల కోసం జీవితాన్ని అంకితమిచ్చిన మహనీయుడు కామ్రేడ్ అయోధ్య. మరణం మనమందరినీ తీవ్రంగా కలచివేసింది” అని భావోద్వేగంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపందా) నాయకులు శెట్టిపల్లి నాగేశ్వరరావు, కురసం రామకృష్ణ, అలవాల సమ్మన్న, ఎండి యాకూబ్ అలీ, పి. సంజీవరెడ్డి, రాజకుమార్, వంశీ తదితరులు పాల్గొన్నారు.









