‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి బయలుదేరిన కాంగ్రెస్ బీసీ నాయకులు – చర్లపల్లి స్టేషన్లో నాగా సీతారాములు వీడ్కోలు
తెలంగాణ,ఆధాబ్ న్యూస్:
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం ప్రారంభమైంది. టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున కాంగ్రెస్ బీసీ నాయకులు, కార్యకర్తలు ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైలులో బయలుదేరారు.
ఈ సందర్భంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు చర్లపల్లిలో నాయకులకు సెండాఫ్ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ నిశ్చయబద్ధంగా ముందుకు వస్తోంది. ఇతర రాజకీయ పార్టీలు మాత్రం రెండు నాలుకల ధోరణి అవలంబిస్తున్నాయంటే అది సిగ్గుచేటు” అని విమర్శించారు.
భారత పార్లమెంట్ సమావేశాల్లో, తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 42% బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. “కాంగ్రెస్ ఈ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తుంది. కానీ బీజేపీ పార్టీ బీసీలను మోసం చేస్తోంది. తమ మద్దతు లేదని పార్లమెంట్ లో స్పష్టం చేయడం బాధాకరం. రాబోయే రోజుల్లో బీసీలు బీజేపీకి గుణపాఠం చెబుతారు” అని హెచ్చరించారు.
అలాగే ఈ ఉద్యమంలో పార్టీలకతీతంగా అన్ని బీసీ సంఘాలు, నాయకులు ఒకమాట మీద కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల అమలుకు ఇది చారిత్రాత్మక అవకాశం అని వ్యాఖ్యానించారు.









